Wednesday, March 10, 2010

కలర్ లో మాయాబజార్ ! ఒక అభిమాని మోదం...ఖేదం!

నేనొక సీనియర్ సిటిజన్ ని. అంటే, మాయాబజార్ 1957 లో మొదటి సారి విడుదల చేసినప్పుడు చూసి, ఇంకా భూమ్మీద ఉన్న వాళ్ళలో నేనూ ఒకణ్ని.ఎనిమిదేళ్ళవయసులో విజయవాడ లో ఆ రోజుల్లో మా ఇంటికి కాంపౌండు గోడ మీద ప్రతి శుక్రవారం మాయాబజార్ వాల్ పోస్టర్ అతికించే వారు.ప్రతి శుక్రవారం పొద్దున్నే లేచిపోయి ఆత్రం గా గోడ దగ్గరికి పరిగెత్తే వాళ్ళం.ఆ రోజుల్లో సినిమా పబ్లిసిటీ కి వాల్ పోస్టర్ లే ఆధారం.నాకు బాగా గుర్తు...ఒకవారం చిత్రం లోని నౌకా విహారం దృశ్యం ని పోస్టర్ వేస్తే,మరో వారం
కృష్ణుడు ఘటోత్కచుడికి చెవిలో (చెయ్యవలసిన పని) ఉపదేశించే దృశ్యం... అలా అలా మా ఇంటి ముందు ప్రతి వారం వాల్ పోస్టర్లు కన్నుల పండుగ చేసేవి. ఇక ఆదివారాలు, స్కూల్ కి సెలవులు వస్తే, పిల్లల గాంగ్ అందరం చెట్ల కింద చేరి మాయాబజార్ ఆట ఆడుకునే వాళ్ళం. కొబ్బరి ఈనెల తోను, చీపురు పుల్లల తోను బాణాలు చేసి యుద్ధాలు చేసే వాళ్ళం. ప్రస్తుతం అమెరికా లో ఉంటున్న నా మేనకోడలు ఆమధ్య వచ్చినప్పుడు ఆ ఆటలన్నీ గుర్తుచేసుకుని సంతోషం గా నవ్వుకున్నాము. కాలం గడిచేకొద్దీ బంగారం విలువ పెరుగుతూ పోతున్నట్టే,మాయాబజార్ విలువ కూడా పెరుగుతూ వస్తోందే కాని ఎప్పటికీ తరగదు అని చెప్పటానికే ఇదంతా రాయటం.బాల్యం నుంచి ఇప్పటివరకు ఓ ముఫ్ఫైసార్లు చూసినా,చూసిన ప్రతిసారీ అంతకుముందు నాకు తెలియని ఏదో కొత్త విషయం, లేదా నాదృష్టికి రాని ఓ కొత్త కోణం కనబడుతూ వస్తోంది. నావరకు నాకు (ఇప్పటికీ) మాయాబజార్ చూడటం..మాయాబజార్ గురించి ఆలోచించటం..మాయాబజార్ గురించి మాట్లాడటం..మాయాబజార్ గురించి చదవటం ఓ ఎడ్యుకేషన్! మాయాబజార్ కి ముందు సినీ పరిశ్రమలో,పౌరాణిక చిత్రాలని భారత, భాగవత,రామాయణ గ్రంధాలనుంచి తీసుకున్న కధలని మక్కికి మక్కీ గానే తీస్తూ వచ్చారు.కాని, మైథాలజీ లోంచి ఫిక్షన్ ని సృష్టించి, చిత్రాన్ని నిర్మించి విజయం సాధించటం అనేది విజయా వారికే చెల్లింది! అలా అని మాయాబజార్ రచన పూర్తిగా పింగళి వారి స్వకపోలకల్పితం అని చెప్పటానికి లేదు.కొన్ని దశాబ్దాల కిందట కర్నాటక లోని మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో "శశి రేఖాపరిణయ" పేరుతొ, గుబ్బివీరన్న నాటక సమాజం వారు నాటకం,యక్షగానం ఆడేవారు.కాకపొతే...భారత కధ లోని ముఖ్యమైన పాత్రల్లో కొన్నిటినే తీసుకుని, ఆయా పాత్రల ఔచిత్యం చెడకుండా...పైగా మరింతా పెరిగేలా చేసి ఆద్యంతం ఉత్కంట భరితం గా కధనాన్ని జవనాశ్వంలా నడిపారు శ్రీ పింగళి నాగేంద్ర రావు,శ్రీ కే.వి.రెడ్డి ద్వయం.(కాకపొతే, ఒకే ఒక్క పాత్ర.. శశిరేఖ.. మాత్రం కల్పితం.)
మాయాబజారు నిర్మాణం లో ఉన్న సమయం లోనే దేశం లో కలర్ చిత్రాలు అడపాదడపా విడుదల అవుతూ ఉండేవి. కాకపొతే షూటింగ్ పూర్తయ్యాక వాటిని కలర్ ప్రాసెసింగ్ కోసం లండన్ వెళ్లి ప్రింట్ చేసే వారు.అవన్నీ "టెక్ని కలర్" చిత్రాలని చెప్పేవారు.కాని ఎక్కువగా భారీ చిత్రాలు తీసే హిందీ చిత్ర నిర్మాతలే వర్ణ చిత్రాలు తీసేవారు. మహబూబ్ ఖాన్ తీసిన మదర్ ఇండియా,సన్ అఫ్ ఇండియా, వి .శాంతారాం తీసిన ఝనక్ ఝనక్ పాయల్ బాజే, నవరంగ్ వగైరాలన్నీ టెక్నికలర్ లో తీసారు. దక్షిణ భారత సినీ పరిశ్రమలో వచ్చిన ఏకైక టెక్నికలర్ చిత్రం "కొంజుం సలంగై." . తెలుగు లో "మురిపించే మువ్వలు" గా డబ్ చేసారు.
ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఆసియా లోనే అతిపెద్ద స్టూడియో (విజయా-వాహిని) అధినేతలు,మాయాబజార్ నిర్మాతలైన నాగిరెడ్డి, చక్రపాణిలు, మార్కస్ బార్ ట్లే లాంటి కెమెరా మాంత్రికుడు తలుచుకుంటే, కాదు కాదు పెద్దమనసు చేసుకుని ఉంటే, వాళ్లకి మాయాబజార్ ని టెక్నికలర్ లో తీయటం ఏమాత్రం కష్టం కాదు.అలా జరిగుంటే..ఈనాడు మాయాబజార్ లాంటి అత్యుత్తమ కళాఖండం ఈనాడు కలర్ లో మనంచూస్తున్న విధం గా కాక, ఏ విధమైన ఎడిటింగ్ లు,కటింగ్ లు లేకుండా ఉన్నది ఉన్నట్టు గా యాభయ్యేళ్ళ తర్వాత కూడా తరతరాల ప్రేక్షకులకి కన్నులపండుగ..వీనులవిందు చేసేది.
(మాయాబజార్ పూర్తి చేసిన తరువాత కొద్ది కాలానికే మార్కస్ బార్ ట్లే కలర్ చిత్రం "చెమ్మీన్" (మలయాళం) కు చాయాగ్రహణం చేసారు. తర్వాత విజయ సంస్థ కే హిందీ లో రామ్ ఆర్ శ్యాం,తదితర చిత్రాలు చేసారు.మార్కస్ బార్ ట్లే చాయాగ్రహణం చేసిన ఆఖరి చిత్రం "శ్రీ కృష్ణ సత్య"కూడా వర్ణ చిత్రమే!) ఆ తర్వాత అనతికాలం లోనే బొంబాయి లో ఫిలిం సెంటర్ స్టూడియో దేశంలో మొదటి కలర్ ప్రాసెసింగ్ లేబొరేటరీ ప్రారంభించిన క్రమం లో మద్రాస్ లో జెమిని వారి లేబరేటరీ కూడా మొదలయ్యేసరికి దేశం లో వర్ణచిత్రాల నిర్మాణం జోరు పెరిగిపోయింది.
దాంతో ఇక విజయ-వాహిని సంస్థ కూడా కలర్ చిత్ర నిర్మాణం లోకి దిగినా,హిందీ లో చెత్త చిత్రాలు తీసి చేతులు కాల్చుకోటమే కాకుండా, సంస్థ ప్రతిష్ట ని కూడా దిగజార్చుకుంది. మాయాబజార్ విషయం లో కూడా విజయ సంస్థ కి ఓ అపప్రధ ఉన్నదని కర్ణాకర్ణి గా నాకు తెలిసింది. అదేమిటంటే, మాయాబజారు నిర్మాణం మొదలయ్యాక, చిత్రం కి అయ్యే బడ్జెట్ విషయమై నిర్మాతలకి, దర్శకుడు కే.వి.రెడ్డి కీ మధ్య మనస్పర్ధలు వచ్చాయని.. ఒక దశలో చిత్రం ఆగిపో యెంత వరకు వచ్చిందని విన్నాను. తర్వాత తెలుగు ప్రేక్షకుల అదృష్టం బాగుండి మాయాబజార్ మన కళ్ళ ముందు నిలిచింది.

nostalgia లోంచి ఊడిపడి వర్తమానం లోకి వస్తే....
మాయాబజార్ ని శతసహస్ర వర్ణ రంజితం చేసే నిర్ణయం తీసుకోవటం లో "జాప్యాలస్యం" జరిగినా, అందుకు పూనుకున్న "గోల్డ్ స్టోన్"వారి కృషి సామాన్యమైనదేమీకాదు.అందుకు వాళ్లకి "వందన నమస్కారంలు" చెయ్యక తప్పదు. వారి చిత్తశుద్ధినీ, నిజాయితీని,మాయాబజార్ మీద వాళ్లకి ఉన్న ప్రేమ ని శంకించాల్సినపనిలేదు. వాళ్ళు ఎంత ఆరాధనతో,అంకితభావం తో పనిచేసారో టీవీ చానెల్స్ లో వచ్చిన, "ప్రోమోస్" చూస్తేనే మనకి అర్ధం అవుతుంది.వాళ్ళూ పడిన శ్రమ వృధా కాలేదు.కాని, శిధిలావస్తలో ఉన్న చిత్రం నెగెటివ్ ని చిత్రిక పట్టే క్రమం లో పడరాని పాట్లు పడటం ,చిత్రానికి ప్రాణమైన నేపధ్య సంగీతాన్ని ఉన్నదున్నట్టు గా సౌండ్ ట్రాక్ లో కి తీసుకు రావటం లో విఫలమైన కారణం గా, కత్తిరింపు లకు గురై చిత్రం ని కుదించాల్సిన నిస్సహాయపరిస్తితిలో కూడా భగీరధ ప్రయత్నం చేసి కంటిన్యుటీ లో ఏమాత్రం పట్టు సడలనీకుండా మాయాబజార్ ని మనముందుంచారు!Hats off ! to Gold Stone co. అని చెప్పక తప్పదు.
కాకపొతే...నేను ముందే చెప్పానుకదా...పాత తరం వాడిగా నేను వర్ణ చిత్రం గా పునర్జన్మ పొందిన చిత్రం ని చూసి ఎంత ఆనందించానో, అంత ఖేదపడ్డాను.
క్లుప్తం గా, స్పష్టం గా చెప్పాలంటే...కలర్ మాయాబజారు, బ్లాక్ అండ్ వైట్ మాయాబజార్ విలువని మరింత పెంచింది.చిత్రం లోని కొన్ని దృశ్యాల,పాటల,సంభాషణల తీసివేత అలా ఉంచి, ముందు ఇతరత్రా చేసిన రిపేర్లు గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను.
అ)విజయ వారి లోగో తెరమీద పడగానే వచ్చే సిగ్నేచర్ ట్యూన్, టైటిల్స్ తెర పై వస్తున్నప్పుడు వచ్చే నేపధ్య సంగీతం..ఈ రెండూ పాతవి చెరిపేసి, తిరిగి ఆర్కెస్ట్రా తో మళ్ళీ రికార్డ్ చేసి జోడించారు.ఎంతైనా ఒరిజినల్,ఒరిజినలే కదా!ఈ రీమిక్స్ లు రెండూ పేలవం గానే వినిపించాయి.
ఆ)ప్రియదర్శినిలో బలరామునికి దుర్యోధనుడు కనపడినప్పుడు సడన్ గా విన వచ్చే ఆర్కెస్ట్రా హోరు దృశ్యం,సందర్భంలో దుర్యోధనుడి రాజసాన్ని, పదిరెట్లు పెంచేది గా ఉంటుంది.అది కూడా చెరిపేసి తిరిగి పేలవంగా రికార్డు చేసి జోడించబడింది.
క) చిత్రం ని సినిమాస్కోప్ లోకి మార్చటం వలన కనిపించే దృశ్యం జూమ్ అయి,స్పష్టత వచ్చిందే కాని, దృశ్యాలలో కింది భాగాలలో కనపడే కొన్ని ప్రాపర్టీస్ మాయం అవటం మనం స్పష్టం గా చూస్తాం.ఉదాహరణకు..ఘటోత్కచ,అభిమన్యుల యుద్ధప్రారంభంలో ఘటోత్కచుడు పర్వతాగ్రం పైకి దూకి నిలబడగానే, ఆ వేగానికి ఒక పెద్ద కొండ రాయి విరిగిపడుతుంది.అంతే!ఆ సీన్ కి ఏభై ఏళ్ళ పాటు ధియేటర్ లన్నీ చప్పట్లతో,ఈలలతో దద్దరిల్లాయి!అవును మరి...ఘటోత్కచుడి బలపరాక్రమాలని కేవలం ఒకే ఒక షాట్ లో చూపించిన కే.వి.రెడ్డి,లేక మార్కస్ బార్ట్లే, లేదా ఇద్దరి ప్రతిభ అది.మరి...ప్రస్తుతం రాయి విరిగి పడటం మనకు కనిపించదు. సినిమాస్కోపు మింగేసింది.తర్వాత,శర్మ-శాస్త్రి ద్వయాన్ని ముప్పుతిప్పలు పెట్టే గింబళీ దృశ్యం లో చేయి పడినప్పుడల్లా దూరంగా జరిగిపోయి ఏడిపించుకుతినే తమలపాకుల పళ్ళెం మనకు కనిపించదు.పిల్లలు కుర్చీల్లోంచి లేచిపోయి చప్పట్లు కొడుతూ నవ్వే సన్నివేశం అది.ఇలా సినిమాస్కోపు కొలతలు మింగేసి, మనని విలవిల లాడించే దృశ్యాలు అనేకం.
ఇక దృశ్యపరంగా, సంగీత పరంగా, సంభాషణల పరంగా తీసివేత కి గురైన భాగాలని గురించి చెప్పాలంటే...
అ) దారుకుని పాట "భళి భళి భళి భళి దేవా..." పూర్తిగా తొలగించారు.
ఆ)మోహిని భస్మాసుర నృత్య రూపకం పూర్తిగా తొలగించారు.
ఈ)లల్లిలలా పాట(శశి రేఖ పెద్దదైనపుడు)ని సగం తొలగించారు.
ఉ)పెళ్ళిపెద్దల పాట "దయచేయండి,దయచేయండి,"ని ముప్పాతిక భాగం తొలగించారు.
ఏ)ఘటోత్కచుని పద్యాలు, "దురహంకార మదాంధులై", "స్వాతిశయమున త్రుళ్ళు"...ఈ రెంటినీ తొలగించారు.
ఐ)సి.ఎస్.ఆర్ తన సొంత గొంతు తో పాడిన అరుదైన లఘు గీతం(కూనిరాగం అందామా?)"శకుని ఉన్న చాలు..శని ఏల అని కదా!..అవును..నిజమే.. నేను, అంత ఘనుడ!కాని పనుల నైన, కాజేసుకొని గాని, మానిపోవలేనే...మాయలాడి!"ఈ లఘు గీతాన్ని శ్రీ సీయస్సార్ గమకాల్తోను,సంగతుల తోను భేషుగ్గా పాడి వినిపించారు!(పూర్వాశ్రమం లోచిత్రాల్లో తన పాటలు తనే పాడుకున్న గాయకనటుడు కదా మరి!).
ఇది కూడా తొలగించారు.
ఓ)శ్రీకరులు దేవతలు పాటలో కృష్ణుడు,రుక్మిణి ఆశీర్వదించే చరణం ని తొలగించారు.
క)సాత్యకి, బలరామ క్రిష్ణులకి చిత్రపటంచూపుతూ రాజసూయాన్ని, మయసభని, వర్ణిస్తూ చెప్పే సంభాషణలు తొలగించారు.
ఖ)ఘటోత్కచుని ఆశ్రమంలో చిన్నమయ్య శిక్షణ, లంబు-జంబు ల అల్లరి సగభాగం తొలగించారు.
గ)దుఖం లో ఉన్న శశిరేఖకోపం తో చెలికత్తె చెంప పగలకొట్టే దృశ్యం...అదృశ్యం!
ఘ)ఇంటర్వల్ తర్వాత వచ్చే హాస్య సన్నివేశం...లక్ష్మణ కుమారుని తో శర్మ-శాస్త్రి,సారధి లు చేయించే పెళ్లి రిహార్సల్ సీను-"వివాహ కార్యక్రమం లో అతి ముఖ్యమైన చిట్టచివరి క్రియ ఇది."అని శర్మ-శాస్త్రి చెప్పబోతుంటే," అంటే అంత్యక్రియలు."అనిలక్ష్మణ కుమారుడు పూర్తి చేస్తాడు. డైలాగు పరం గా పేలే ఈ హాస్య సన్నివేశం కూడా తొలగించారు.
జ)ఘటోత్కచుడు ద్వారక లో ప్రవేశించే దృశ్యం..అగ్గిపెట్టెల్లాంటి ఇళ్ళ మధ్య జాగ్రత్తగా అడుగులు వేస్తూ నడిచే ట్రిక్ షాట్,చిన్నమయ్య, విడిది నగరం నిర్మించ బోయేముందు లంబు-జంబులకు ప్లాన్ (పతకం)చూపించటం,అక్కడి సంభాషణలు తొలగించారు.
కంప్యూటర్ టెక్నాలజీ ఏ మాత్రం తెలీని నాలాంటి చాలామందికి అర్ధం కాని విషయం ఒకటుంది. చిత్రం నెగెటివ్ శిధిలావస్థ లో ఉండటం చేత చిత్రం లో కొంత భాగం తీసివేతకి, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ రీమిక్స్ చేయటం అనివార్య మైనదని గోల్డ్ స్టోన్ నిర్వాహకులు చెప్పటం జరిగింది. అదే నిజమైతే, కంప్యూటర్ యుగంలో చిత్రాలు సీడీలు, డీవీడీలు గా మారి టీవీ చానేల్సులోను, ఇళ్ళలోను,జనం చూస్తున్నారు.తెలుగు వాళ్ళ పండుగ రోజుల్లో ఏదో ఒక తెలుగు చానల్ నుంచి ప్రతి ఏడాది లో కొన్ని సార్లు మాయాబజార్ చిత్రం చక్కని క్వాలిటీ లో స్పష్టమైన ఆడియోతో తో ఎలాంటి కోతలు,తీసివేతలూ లేకుండా టెలికాస్ట్ చేయబడుతున్నది. డీవీడీలు చిత్రం ప్రింట్ నుంచి కాక నెగెటివ్ నుంచే తీస్తారని విన్నాను. విడియో ప్రభంజనం వలన ఇదివరకంత తరచుగా కాకపోయినా, ఇటీవలి కాలం వరకూ(అంటే కలర్ లో రిలీజ్ కాక ముందు) అప్పుడప్పుడూ దియేటర్ లలో ప్రదర్శిస్తున్న తెలుపునలుపుల చిత్రం కూడా కట్స్ లేకుండానే క్వాలిటీ ఉన్న ప్రింట్ లలోనే ప్రదర్శింప బడింది. మరి ఆ ప్రింట్ లు ఏభై ఏళ్ళ కిందటివి కావని,కొద్ది సం.ల కిందనే రీప్రింట్ చేయబడినవని చూసినవాళ్ళకి స్పష్టం గా తెలుస్తుంది. మరి నెగెటివ్ పాడయితే,ఇది ఎలా సాధ్యం?
ఇక వర్ణ చిత్రం లో నాకు నచ్చిన అంశాలలో మొదటిది..యాభై ఏళ్ళ క్రితం సావిత్రి మహోన్నత సౌందర్యం, అనితర సాధ్యమైన అభినయం ని కలర్ లో చూడ గలగటం. తర్వాత నటీనటుల దుస్తులు, ఆభరణాలు, గోఖలే-కళాధర్ ల సృష్టి లో ధగధ్ధగాయ మానం గా వెలిగిపోయిన భారీ సెట్టింగ్ లు, మార్కస్ బార్ ట్లేచాయాగ్రహణం.
చివరాఖరిగా నేను చెప్పేదొకటే. మనకి మాయాబజార్ సంపూర్ణం గా కలర్ లో చూడ లేక పొతే ఆ తప్పు గోల్డ్ స్టోన్ యాజమాన్యం ది కానే కాదు. తెలుగు సినీ చరిత్ర లోనే అత్యుత్తమ కళాఖండం గా నిలిచిన చిత్రం నెగెటివ్ ని కాపాడలేని విజయ-వాహిని సంస్థ నిర్వాహకులది, వారి వారసులదీను. అంతేకాదు. మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ సిగ్గుతో తలవంచు కోవాల్సిన సమయం ఇది.