"కెవ్వు" మని గావుకేక పెట్టాడు అనామక రావు. కుంటుకుంటూ నాలుగడుగులు వేసి గట్టు మీద కూలబడి అరిపాదాలు చేత్తో రాసుకుంటూ "అబ్బా, అయ్యో," అంటూ మూలిగాడు. పళ్ళ బిగువున బాధ అణుచుకున్నాడు.
ప్రస్తుతం... అతడు శబరిమలై లో ఉన్నాడు. మిత్రబృందం తో కలిసి అర్ధ రాత్రి రెండో జాము లో , కాళ్ళకి చెప్పులు.. నడుం పైభాగాన ఆచ్చాదన లేకుండా కొండ ఎక్కుతూ ఉన్నాడు. అతడు చేసిన ఆర్తనాదాలు కొండ ఎక్కుతుంటే కాళ్ళలో సూదుల్లాంటి చిన్న గులక రాళ్ళు గుచ్చుకోగా పుట్టిన మంట తాలూకువి.
నెమ్మదిగా మంట తగ్గింది.
అసలు మంట రాజుకుంది. మీమాంస, జిజ్ఞాస తాలూకు మంట.
అంతవరకూ కొండ పైన దట్టంగా పెరిగిన అడవి.. కళ్ళ ముందు పరచిన అద్భుత మైన ప్రకృతిసౌందర్యం తో మమేకమై పోయి నడుస్తున్న వాడు గులక రాళ్ళ దెబ్బతో వర్తమానం లోకి ఊడిపడ్డాడు.
"ఏం, మిత్రమా బ్యాటరీ డౌనైపోయిందా?" వచ్చి పక్కనే కూర్చుని అడిగాడు మిత్రుడైన మరో భక్త శిఖామణి.
టవల్ తో ముఖం తుడుచుకుంటూ చెప్పాడు అనామక రావు."అయ్యప్ప దర్శనం సంగతేమో గాని, ఎండకి వేడెక్కిన బండ రాళ్ళ మీద నడుస్తూంటే..కాళ్ళు కాలినప్పుదల్లా..సూదుల్లాంటి రాళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా దేవుళ్ళందరూ కనపడుతున్నారు."
"తప్పు తప్పు. కలలో కూడా అలా అనుకోకూడదు."చెంపలేసుకుంటూ చెప్పాడు మిత్ర భక్తుడు."మన శరీరం ఎంత నొప్పి పెడితే, అవయవాలని ఎంత హింస పెడితే మనకి అంత పుణ్యం వస్తుంది."
"అర్ధం కాలేదు"అయోమయం గా చూసాడు అనామకుడు."ఒళ్ళంతా పచ్చి పుండు అయితే గాని పుణ్యం రాదా?"
"అంతే మరి!" ఖచ్చితం గా చెప్పాడు భక్త మిత్రుడు." నువ్వెన్నిసార్లు కుయ్యో మొర్రో అని ఆర్తనాదాలు చేస్తావో, అదే సంఖ్యలో నువ్వు చేసిన పాపాలు పోతాయి!" గ్యారంటీ ఇచ్చాడు.
"పాపాలు పోయాయి. సరే.. మరి పుణ్యం నా ఖాతాలో ఎప్పుడు క్రెడిట్ అవుతుంది?మళ్ళీ ఇంకోసారి ఈ కొండెక్కి ఒళ్ళూ, కాళ్ళూ పచ్చడి చేసు కుంటే నా?" అంటూ డౌటు పడ్డాడు అనామక రావు.
"ఇంకెక్కడి పుణ్యం? ఇలాంటి ప్రశ్నలు ఆలోచనలే బుర్ర లోకి రాకూడదు రా బాబూ!"చెంపలేసుకుంటూ అన్నాడు మిత్ర శిఖామణి."నీ పాపాల చిట్టా పెంచుకోకు. అయ్యప్పస్వామిదగ్గర నీ ఖాతా ఓవర్ డ్రాఫ్టు ఐపోతుంది జాగ్రత్త! ఒళ్ళు దగ్గిర పెట్టుకో."
ఇద్దరూ బ్యాంక్ ఉద్యోగులవటం చేత వాళ్ళ మాటల్లో బ్యాంక్ భాష ఎక్కువగా దొర్లుతూ ఉంటుంది.
"అది సరే గాని, చెప్పులేసుకుని కొండ ఎందుకు ఎక్కకూడదన్నారో నాకు బోధ పడలేదు." మళ్ళీ సందేహం వెలిబుచ్చాడు అనామక రావు.
"అబ్బా!" అంటూ తల పట్టుకున్నాడు మిత్రుడు."నువ్వు దీక్ష తీసుకోకుండా యాత్రకి వచ్చినందువల్లే నీకు ఇలాంటి దుష్ట ఆలోచనలు వస్తున్నాయి."ఓ నిమిషం ఆలోచించి బదులిచ్చాడు మిత్ర భక్తుడు." అయ్యప్పస్వామినివసించి కొలువై ఉన్న ఈ శబరిమల కొండ మహా పవిత్రమైనది. పాద రక్షలు వేసుకుని ఎక్కటం అంటే కొండని అపవిత్రం చెయ్యటమే! అది చాలా దోషం..మహా పాపం కూడా!" అని ముగించాడు.
ఒక అయిదు నిమిషాలు ఇద్దరూ మౌనంగా కొండ ఎక్కారు.
మిత్రుడు ఆగాడు."కాసేపు అలా గట్టు మీద కూర్చోఇప్పుడే వస్తాను." అన్నాడు.
ఎందుకు ఆగటం అన్నట్టుగా చూసాడు అనామకరావు.
"ప్రకృతి పిలిచింది మిత్రమా?"నవ్వుతూ అన్నాడు మిత్రుడు.పక్కకి తిరిగివెళ్లి చెట్ల గుబురు లో జొరబడ్డాడు. కొద్దిసేపటి తర్వాత తిరిగివచ్చి "వెళ్దాం పద."
ఇద్దరూ మౌనం గా కొండ ఎక్కటం మొదలుపెట్టారు.
"అదిసరే గాని, మిత్రమా! ఇందాక నువ్వు చెప్పులేసుకుని కొండ ఎక్కటం మహాదోషం, కొండ పవిత్రత పాడు చెయ్యటం మహా పాపం అనేకదా చెప్పావు?"
అడిగాడు అనామకరావు..మరోసారి మిత్రుడితో చివాట్లు తినటానికి రెడీ అవుతూ.
"అవును.ఖచ్చితంగా అంతే!"గంట కొట్టినట్టుగా చెప్పాడు మిత్రుడు."కొండని ఎవరు..ఏ విధంగా అపవిత్రం చేసినా..అది మహా పాపం! ఖచ్చితంగా నరకానికి వన్ వే లో వెళ్ళిపోతారు. అది మాత్రం గ్యారంటీ."
"కాళ్ళకి చెప్పులు వేసుకుంటేనే కొండ అపవిత్రం ఇపోతుందని, అలా చెయ్యటం మహాపాపం అని ఘోషిస్తున్నారు కదా.."కొంచెం గట్టిగానే గొణిగాడు అనామకుడు."మరి కొండ ఎక్కిదిగే వాళ్ళందరూ ప్రకృతి పిల్చినప్పుడల్లా కొండ పైనే పని కానిచ్చేస్తున్నారు. పాదరక్షలకే కొండ అపవిత్రం అయితే, మలమూత్రాలతో కొండ అపవిత్రం కాదా? అప్పుడు మీరంతా ఏ నరకానికి వెళతారు?"
మిత్రుడు ఈసారి చెంపలు వాయించుకోలేదు. అనామకరావు అజ్ఞానానికి నిట్టూర్పులూ వదల్లేదు.ఓ నిమిషం పాటు అనామకుడి ముఖం లోకి చూస్తూ నిలబడిపోయాడు.తర్వాత తలవంచుకుని మౌనంగా కొండ ఎక్కటం ప్రారంభించాడు.
అనామకరావు మిత్రుణ్ణి భక్తిగా అనుసరించాడు.